Saturday 31 July 2010

తేట తెలుగు

తెలుగు, భారత దేశములోని దక్షిణ ప్రాంతములోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రపు అధికార భాష, మరియు దాని ప్రక్క రాష్ట్రములయిన తమిళనాడు, కర్ణాటక, ఒరిస్సా, చత్తీస్ గఢ్ ప్రజలు మాట్లాడే భాష. ప్రపంచంలో అత్యధికముగా మాట్లాడే వాటిలో పదిహేనవ స్థానములోనూ, భారత దేశములో రెండవ స్థానములోను నిలుస్తుంది. ప్రపంచంలో అచ్చులతో అంతమయ్యే కేవలం 5 భాషల్లో తెలుగు ఒకటి. మధురమైన మంజులకర కోమల భాష మన తెలుగు. సుమధురమైన భాషగా, సంగీత తుల్యమైన భాషగా తెలుగు కవులచేతనేగాక, ఎందరో ఇతరభాషల కవుల, విద్వాంసులచే "తేనె కన్న తీయనిది"గా, చెవులకు ఇంపైన భాషగా పొగడబడ్డ భాష మన తెలుగు భాష. మన భాషని గురించి ఎందరో మహానుభావులు ఏమన్నారంటే....

దేశ భాషలందు తెలుగు లెస్స —శ్రీ కృష్ణదేవ రాయలు"..

..సుందర తెలుంగినిల్ పాట్టిసైతు తోనిగల్ ఓట్టి విళయాడి వరువోం.."(..సుందర తెలుగులో పాటలు పాడుతూపడవల్లో యాత్రా కేళికి వెళ్ళొద్దాం.) — తమిళ కవి సుబ్రహ్మణ్య భారతి.15 వ శతాబ్దం నుంచీ పాశ్చాత్యులచే "తెలుగు - ఇటాలియన్ అఫ్ ద ఈస్ట్ " గా కీర్తించబడ్డ భాష.

ప్రాచీన భాషగా ప్రస్తుతం గుర్తింపబడ్డ తెలుగు భాషకి దాదాపు 2500 సంవత్సరాల చరిత్ర ఉన్నదని చరిత్రకారులు, భాషా పరిశోధన కారులూ చెప్తున్నారు. వేల ఏళ్ళనించీ వాడుకలో ఉన్న తెలుగు భాషకి కేంద్ర ప్రభుత్వం వారు ప్రాచీన హోదా ఇవ్వడం నిస్సందేహంగా తెలుగు భాషాభిమానులందరికీ ఎంతో సంతోషకరమైన విషయం.

వివిధ అలంకారాలు నిండిన చందోబద్ధమైన పద్యం మన సొంతం. అవధానం తెలుగు భాష ఇంటి పేరు. పద్య కవిత తో పాటు పద కవిత్వం వెల్లి విరిసి, కర్నాటక శాస్త్రీయ సంగీతాన్ని వేల వేల కీర్తనలతో సుసంపన్నం చేసిన వాగ్గేయకారులు తెలుగు వారు. వివిధ రకాల చందస్సులతో కూడిన పద్యం, గద్యం, దండకం, గేయం, నాటకం, జానపద సాహిత్యం, కధ, నవలిక, గల్పిక...ఇలా తెలుగు సాహిత్యంలో ఉన్నన్ని ప్రక్రియలు మరే భాషలోనూ లేవంటే అతిశయోక్తి కాదేమో...!! కీర్తన, సంకీర్తన, పదం, కృతి, యక్షగానం, కావ్యం, ప్రబంధం, శతకం అనేవెన్నో తెలుగు భాషలో వెన్నెలలు వర్షింప చేసాయి. భారత భాషల్లో తెలుగు భాషకు అత్యంత విలువను కొని తెచ్చాయి.

సంగీతాత్మకమైన భాషగా ఎందరో సంగీత విద్వాంసులచే మన్ననలు పొందిన భాష తెలుగు. తెలుగు భాష లో 56 అక్షరాలు - ప్రాచీన భాషగా ఎప్పటినుంచో గుర్తింపు ఉన్న సంస్కృతం లో కూడా అన్ని అక్షరాలు లేవు. తెలుగు వారిగా పుట్టడం మనం ఎంతో గర్వించాల్సిన విషయం. ప్రపంచ సాహిత్య రంగంలో అయిదవ స్థానంలో ఉజ్వలంగా ఒక్క వెలుగు వెలిగిన తెలుగుభాష, నేడు తన అస్థిత్వాన్నే కోల్పోతూండడం ఎంతో బాధాకరమైన విషయం. మన ఉద్యోగ అవసరాలకి ఎన్ని భాషలని నేర్చుకున్నా, మన మాతృభాష ని మరచిపోకుండా కాపాడి, ముందు తరాల వారికి మన తెలుగు సాహితీ సుగంధాన్ని పంచాలి.

స్వాతంత్ర్యానికి పూర్వం ఆంగ్లేయులు జిల్లా అధికారులుగా నియమించబడాలంటే హిందీ లేక తెలుగు ఈ రెండు భారతీయభాషల్లో ఒకటి తప్పనిసరిగా నేర్చుకోవాలని స్పష్టమైన ఆదేశాలు ఉండేవి. ఆ రోజుల్లో ఉత్తర భారత దేశానికి హిందీ ఎలాగో దక్షిణ భారత దేశంలో తెలుగు అలా వాడుకలో ఉండేది. మరి నేటి పరిస్థితి చూస్తే అదంతా పూర్తిగా మారిపోయింది. భాషా ప్రయుక్త రాష్ట్రాల వల్ల ఎక్కువగా నష్టం జరిగింది తెలుగు వారికే. తెలుగు వారు ఉంటూన్న దాదాపు 10 జిల్లాలు పొరుగు రాష్ట్రాల వారికి వెళ్ళిపోయాయి. అక్కడ తెలుగు బడులు లేని దుస్థితి చూస్తే చాలా బాధ కలుగక మానదు. (ఇటీవలి కాలంలో తమిళనాడు లోని కృష్ణగిరి జిల్లాలో తెలుగు భాష కోసం తెలుగు వారు పోఋఆడడం అందరికీ తెలిసిందే!) పద్యం మన సొంతం అని చెప్పుకుంటూ ధాటిగా ఒక్క పద్యాన్ని కనీసం చూసి చదవలేని దుఃస్థితి లో చాలామందిమి తెలుగు వాళ్ళం ఉండడం ఎంతో దురదృష్టకరం. వెలలేని మన సాహితీ సంపదను మన పెద్దలు ఎంతో శ్రధ్ధతో కాపాడుకుంటూ వచ్చారు. కనీసం కాసిని వేమన పద్యాలూ, కొన్ని సుమతీ పద్యాలూ, పోతన భాగవతంలో గజేంద్ర మోక్షం, ప్రహ్లాద చరితం, రుక్మిణీ కళ్యాణం ఘట్టాల్లోని కొన్ని పద్యాలైనా తెలుగు వారి నాలుకలమీద నాట్యమాడేవి. మరి నేడో? --- వేగంగా అంతరించిపోతున్న భాషల్లో తెలుగు కూడా ఒకటి. ఈ పరిస్థితి చెయ్యి దాటకముందే మన భాషని, మన సాహితీ సంపదని కాపాడుకోవలసిన బాధ్యత మనందరిదీ ! మన భాషలోని సొగసును, మాధుర్యాన్ని చవి చూడక, చాలా మంది తెలుగును నిర్లక్ష్యం చేస్తున్నారు.

"తేనియలకే తీపి పెంచే తెలుగులో మాటాడుకో.

తెలుగు జాతి సమైక్య గీతి పదే పదే నువు పాడుకో.

ఏ ప్రదేశంలోన ఉన్నా ఏ విదేశంలోన ఉన్నా,

జీవనిదిగా నీకు మిగిలిన స్వీయ సంస్కృతి నిలుపుకో.

స్వాభిమానం కేతనంగా సామరస్యం స్యందనంగాతరలిపోతూ నిత్యనవ చైతన్య దీప్తిని పెంచుకో."

అన్న పద్మభూషణ్, జ్ఞానపీఠ పురస్కార గ్రహీత, సి.నారాయణ రెడ్డి గారి సుమధుర భావాభిరామంతో మనందరం ఏకీభవిస్తూ అమ్మ భాషను ఆదరిద్దాం.

"గట్లనే" అని తెలంగాణా మాండలికంలో అన్నా, "అలగలగే" అని ఉత్తరాంధ్ర యాసలో చెప్పినా, "ఆయ్, అలాగేనండీ" అని గోదారి జిల్లాల యాసలో మాట్లాడినా, "అట్లాగే/ అట్టాగే" అని కృష్ణా/గుంటూరు మాండలికంలో నొక్కి వక్కాణించినా, "అట్నే" అని నెల్లూరు / చిత్తూరు ప్రాంతాల మాటల్లో తెలిపినా, "అట్లే" అని రాయలసీమ భాషలో నుడివినా, అది మన తెలుగు భాషలోని అందమే. పైన చెప్పిన అన్ని మాండలికాల్లో అన్నట్లు మనం "అలాగే" నని మన భాషా సేవకై ఏకీభవిస్తూ ముందుకు సాగాలని ఆశిస్తున్నాను.

ఈరోజే గుల్మొహర్ బ్లాగులో తెలుగు జాతీయత గురించి చదివాక నేను మా కార్యాలయంలో ప్రారంభించిన తెలుగు సాహితి అనే తెలుగు సాహితీ సమాఖ్య ఆహ్వానంలో తెలుగు గురించి రాసిన నాలుగు మాటలు మీ ముందు ఉంచాలని అనిపించింది. చంద్రచూడ్ శాండిల్య గారికి ఈ విధంగా అభినందనలు తెలపాలని అనిపించింది.

No comments: