Monday 28 June 2010

మన పీ వీ జయంతి

చెప్పుకుంటే సిగ్గుచేటు.....ఒక మహా మనిషి మహాభినిష్క్రమణాన్ని కూడా రాజకీయం చేసి, ఆయన శవాన్ని అవమానించారు!
మన నాయకుణ్ణి అవమానిస్తుంటే చూస్తూ ఊరుకున్న తెలుగు నాయకులందరికీ సిగ్గుండాలి.....!
నేడు పి వి జయంతి ... ఢిల్లీలో ఒక స్మారక చిహ్నానికైనా నోచుకోని ఆయన గురించి తలచే అర్హత కూడా ఈ కాంగ్రెసు నాయకులకి లేదు. అన్ని పాపాలనీ పి వి కి అంటగడుతున్నారు! ఆయన ఇప్పటి నాయకుల్లాగా లక్షల కోట్లు మూట కట్టుకోలేదు. అవినీతికి పాల్పడలేదు. స్వంతవారిని అందలాలెక్కించలేదు. దేశం కోసం అలోచించారు ..... దేశం కోసం జీవించారు .... 16 భాషలు అనర్గళంగా మాట్లాడగల దిట్ట. సాహిత్యంలో తనదంటూ ఒక ముద్ర వేసిన పుంభావ సరస్వతి. దేశ భాషలే కాదు, విదేశీ భాషల్లో సైతం ప్రావీణ్యత సాధించి, ఎన్నో రోజులు విదేశాంగ శాఖ మంత్రిగా ఖ్యాతి గడించిన పండితుడు. దేశాన్ని సంస్కరణల బాట పట్టించి, నేటి భారతాన్ని ఇంత సంపదతో తులతూగేలా చేసిన మేధావి. సోనియమ్మ భజన చేసే తెలుగు కాంగ్రెసు నాయకులంతా .... అన్ని పాపాలు ఆయనకి అంటగడుతుంటే చూస్తూ ఎలా ఊరుకుంటున్నరో నాకు అర్ధం కావట్లేదు! ఆయన ఒక తెలుగు వాడు కనుకే ఈ అన్యాయం జరుగుతోంది, అదే ఏ తమిళుడో, గుజరాతీనో, బెంగాలీ నో అయి ఉంటే - ఆకాశానికి ఎత్తే వారు, అలా ఆకాశానికి ఎత్తేవరకూ, ఆ రాష్త్రం వారు ఊరుకునేవారు కాదు. అవునులే - అందరికీ వారి జాతి పై అభిమానం ఉంటుంది, ఒక్క తెలుగు వారికే - తన తెలుగు జాతి పై అస్సలు ప్రేమ ఉండదు ... పైగా అదొక గొప్ప విషయంగా చెప్పుకుంటారు! ఈ రోజు ఇంత బీరాలు పలుకుతున్న తెలంగాణా నాయకులంతా, పీ వీ కి అంత అవమానం జరుగుతుంటే ఊరుకుంటున్నారేం? మొత్తానికి ఆయన చచ్చిపోయి, బ్రతికిపోయారు. లేకుంటే ఈ ఆరోపణలు విని తట్టుకోలేకపోయేవారు! తన శిష్యుడైన మన్మోహన్ సైతం అందరిముందూ ఆయన పేరు ఎత్తుకోలేక పోవడాన్ని చూసి, గుండె ఆగిపోయేదేమో!! నిజమైన దేశభక్తుడు, భూదానం చేసి, పేదలకు ఆస్తి పంచి - మాటలు కాక చేతల్లో ప్రతీ పనినీ చేసి చూపి, ఈ తరం వారు ఇంత హాయిగా బ్రతికేందుకు రాచ బాట వేసిన మా పీ వీ తాతయ్యకి (మా తాతయ్య లా అనిపిస్తారు ఆయన!!)నా ఘన నివాళి! కనీసం ఇప్పుడైనా తెలుగు నేతలు మేల్కొని, ఆయనపై బుఱద చల్లనివ్వకుండా చూసుకుంటే - అదే మనం ఆయనకి ఇచ్చే నిజమైన నివాళి అవుతుంది.